తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సంబంధిత మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెల్సిందే.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెయిలైన విద్యార్థుల నుండి రీవెరుఫికేషన్,రీకౌంటింగ్ లకు ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని సూచించారు. అంతే కాకుండా పాసైన విద్యార్థుల నుండి మాత్రం గతంలో మాదిరిగా ఉన్న పద్దతుల్లోనే రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరారు.
అందులో భాగంగా ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులు రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ కు ఎటువంటి దరఖాస్తు చేయనక్కర్లేదని తేల్చి చెప్పింది. అయితే ఫెయిలైన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ ఉంటుందని తెలిపింది. ఇప్పటికే రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లిస్తామని బోర్డు ప్రకటించింది..