బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాన్.. రానురాను ఉధృతంగా మారుతోంది. బుధవారం మధ్యాహ్నం నాటికి అతి తీవ్ర తుపాన్గా రూపాంతరం చెందింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా ఉండటంతో.. అధికార యంత్రాంగం శ్రీకాకుళం తీర ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మచిలీపట్నంకు ఆగ్నేయంగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫోనీ.. గురువారం ఉదయం నాటికి మరింత తీవ్ర రూపం దాల్చి.. ఉత్తర తూర్పు దిశలో .. ఉత్తరాంధ్ర, ఒడీషా తీర ప్రాంతంవైపుకు దూసుకెళ్లబోతోంది. ఈ సమయంలో గాలుల తీవ్రత మరింత ఉధృతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈనెల 3వ తేదీ మధ్యాహ్నం నాటికి మధ్య ఒడీషా తీరంలోని పూరి మరియు పారాదీప్ వద్ద తీరాన్ని తాకి బలహీన పడే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.
అక్కడి నుంచి ఒడీషా దక్షిణ కోస్తా మరియు పశ్చిమ బెంగాల్ వైపు పయనించి పతనమవుతుందని అంచనా వేస్తున్నారు. దీని కారణంగా ఈ ప్రాంతాల్లో 3వ తేదీ అర్థరాత్రి నుంచి 4వ తేదీ తెల్లవారుజాము వరకు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో తుపాన్ విరుచుకుపడబోతోంది. ఫోనీ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై గణనీయమైన ప్రభావం చూపించబోతోందని భావిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం ఉత్తర మరియు తీర ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉత్తర ప్రాంతం మరియు తీర ప్రాంతాలతో పాటు విజయనగరం జిల్లాలోనూ ఈ నెల 2,3 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అలాగే విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియవచ్చని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఫోనీ ప్రభావం ఎక్కువగా గార, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం మండలాలపై ఉండబోతోంది.
విజయనగరం జిల్లాలో భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లో కూడా ఫోనీ ప్రభావం అధికంగా ఉండబోతోంది. రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు.. ఫోనీ తుపాన్ గమనం, రాష్ట్రంపై దాని ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. గాలుల వేగం, వర్ష సూచనలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నారు. సర్వైలెన్స్ కెమెరాల సహాయంతో.. ఆయా జిల్లాల్లో వాతావరణ ప్రభావం ఎలా మారుతుందో గమనిస్తున్నారు. తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తుపాను తీరం దాటే సమయంలో ప్రజలంతా బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో తల దాచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే వాహనాలపై బయట సంచరించరాదని కూడా హెచ్చరిస్తున్నారు. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఆరు నుంచి 10 మీటర్ల వరకు అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దీంతో విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ అధికారులు కోరుతున్నారు. అలాగే సర్వైలెన్స్ కెమెరాలతో ఆయా జిల్లాల్లోని బీచ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. సందర్శకులు బీచ్లలోకి వెళ్లకుండా స్థానిక అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ కనిష్టంగా 120 మిల్లీ మీటర్ల నుంచి 180 మిల్లీ మీటర్ల భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి.