ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంచలనాల ఒరవడిలో మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.రాష్ట్రంలోని పాలక మండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల పాలక మండళ్ల రద్దు చేసే యోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ సంచలన నిర్ణయంతో టీడీపీ నేతలకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో…కొత్త పాలకమండల్లు నియమించేందుకు సిద్ధమైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇందుకు తగిన కసరత్తు మొదలుపెట్టారు. ప్రస్తుత పాలక మండల్ల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, రద్దును పేర్కొంటూ…నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండటంతో ఆర్డినెన్స్ తెచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దేవాదాయశాఖ చట్టం 1987లోని సవరణ ద్వారా ఆర్డినెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ ఆమోదం ద్వారా రద్దు చెయ్యాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
న్యాయపరమైన సమస్యలు రాకుండా చట్టప్రకారం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆర్డినెన్స్ కోసం క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి కావడంతో 8 తేదీన మంత్రి వర్గం ఏర్పాటు రోజే క్యాబినెట్లో పెట్టే అవకాశం ఉంది. క్యాబినెట్ ఆమోదించిన వెంటనే గవర్నర్ కు పంపేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ, అలా కుదరని పక్షంలో 12న జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టి పాలక మండళ్ల రద్దుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అనంతరం వైసీపీ నేతలకు పెద్ద ఎత్తున పదవులు దక్కనున్నాయి.