తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి విదితమే. అయితే ఈ చేరికలపై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. తమపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.ఈ రోజు శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ” కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు.
పార్టీల మార్పిడి కొత్తగా జరగడం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు మా ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకోలేదా?, మా ఎంపీకి రాహుల్ కండువా కప్పలేదా?, వాళ్లు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ వికృత కార్యకలాపాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
గతంలో పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేసుకోలేదా? అని అడిగారు. ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధం కాదని పేర్కొన్నారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి కాంగ్రెస్ నేతలు మాట్లాడాలని హితవు పలికారు. ఒకరిద్దరు ఉన్న టీడీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.