ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ,కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి,మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్ర్తెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలల్లో పన్నెండు మంది కారెక్కారు.ఈ క్రమంలో మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరినందున సీఎల్పీను టీఆర్ఎస్ ఎల్పీలో వీలినం చేయాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి పన్నెండు మంది ఎమ్మెల్యేలు వినతిపత్రం అందించారు.
దీంతో రాజ్యాంగ బద్ధంగా సీఎల్పీను టీఆర్ఎస్ ఎల్పీలో వీలినం చేస్తోన్నట్లు గెజిట్ ను విడుదల చేశారు అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి.దీనికి నిరసనగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి,శాసనసభపక్ష నేత మల్లు బట్టి విక్రమార్క,మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ తదితర నేతలందరూ అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహాం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.
అయితే ఈ కార్యక్రమానికి అందుబాటులో అది కూడా అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉండి కూడా ఎంపీలు కోమటిరెడ్డి,రేవంత్ రెడ్డి హాజరుకాకపోవడంపై పార్టీ శ్రేణులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు.పార్టీని వీలినం చేస్తే చేస్తున్న ఉద్యమం కంటే వీరిద్దరికీ అంత ముఖ్యమైన పనేముందని అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ బీజేపీలో చేరతారని వార్తలు వస్తోన్న తరుణంలో తాజాగా వీరిద్దరూ కల్సి డుమ్మా కొట్టడం హస్తానికి హ్యాండిచ్చి కమలం గూటికి చేరడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు..