తాజా ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కొత్త ప్రుభుత్వాన్ని ఏర్పాటుచేసి ఎన్నికలలో తానిచ్చిన హామీలు అమలుచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అయితే విశాఖలో జనసేన ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన, గతంలో జగన్ కేసులను ఇన్వెస్టిగేట్ చేసిన జేడి లక్ష్మీ నారాయణ మొదటిసారి జగన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రపాలనపై ఆయన స్పందించారు. జగన్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినా మంచి నిర్ణయాలు తీసుకొంటున్నారన్నారు.
ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుండడం బాగుందన్నారు. అలాగే జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పనిచేయడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి రానున్నరోజుల్లో ఇంకా ఎలాంటి పనులుచేస్తారో చూడాలన్నారు. జగన్ హామీలలో మద్యపాననిషేధం తనకు బాగా నచ్చిందన్నారు. దశలవారీగా నిషేధం చేపట్టి పూర్తిగా 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పడం మంచి నిర్ణయమన్నారు. అలాగే రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేకహోదా వంటి అంశాల్లో తమ సహాయ సహాకారాలు కూడా కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటాయని జేడీ తెలిపారు. అయితే జగన్ ని తీవ్రంగా వ్యతిరేకించిన జేడీ ఇప్పుడు జగన్ పాలనను మెచ్చుకోవడం, అలాగే తన సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్తుండడం చాలామందికి అర్ధం కాకపోగా.. కచ్చితంగా ఇది శుభపరిణామమని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు.