నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు పార్లమెంట్ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత అధికార పార్టీ వైసీపీలో,కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి కూడా మనకు తెల్సిందే.
ఈ క్రమంలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పట్లో టీడీపీకి భవిష్యత్తు లేకపోవడం.. మరో పదేళ్ళ వరకు వైసీపీనే అధికారంలో ఉంటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న తరుణంలో పయ్యావుల కేశవ్ తన రాజకీయ భవిష్యత్తుకోసం వైసీపీలో చేరనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం సందర్భంగా వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలో చేరాలనుకునే వారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రావచ్చు అని వ్యాఖ్యానించిన తరుణంలో పయ్యావుల కేశవ్ గురించి ఇలాంటి వార్తలు రావడం గమనార్హం.