కేంద్ర ఆర్థిక బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని పెదవి విరిచారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఏమీ మాట్లాడలేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారని దానిపై స్పష్టత లేదని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏపీ రెవెన్యూ లోటు రూ.60 వేల కోట్ల వరకు పెరిగిందని వెల్లడించారు. ఈ బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుందని, రాష్ట్రానికి తప్పకుండా సహాయం చేస్తామని కేంద్రం కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. పోలవరం, అమరావతిపై నిధుల ప్రస్తావన పెద్దగా లేదన్నారు. ఏపీ ప్రయోజనాలను కాపాడడం కోసం ఏ పోరాటానికైనా తాము సిద్ధమని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.