కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 కి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా కొత్త పథకాలకు బడ్జెట్లో శ్రీకారం చుట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆమె కొత్తగా మత్స్యకారుల సంక్షేమంకోసం ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని గ్రామాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా కొత్తగా ‘హర్ ఘర్ జల్’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రసంగంలో ప్రకటించారు ఇందులోభాగంగా మధ్యతరగతి ప్రజలకు కేంద్ర బడ్జెట్లో శుభవార్త చెప్పారు. అదేమిటంటే 5 లక్షల వరకూ ఆదాయాన్ని ఆర్జించేవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరంలేదని సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో కొన్ని కోట్లమంది మధ్యతరగతి ప్రజలు పన్నుభారం నుంచి మినహాయింపు పొందనున్నారు.
ఈ బడ్జెట్ లో ఇవే హైలైట్స్..
దేశంలో పరిశోధన ప్రోత్సాహానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎన్ఆర్ఎఫ్) ఏర్పాటు
త్వరలో రూ.1, 2, 5,10, 20 కొత్త నాణేల విడుదల.. వీటిని దివ్యాంగులు(అంధులు) కూడా గుర్తించేలా ముద్రణ
దేశవ్యాప్తంగా 17 ఐకానిక్ టూరిజం ప్రాంతాల అభివృద్ధి
మౌలిక రంగం అభివృద్ధి కోసం ‘ఐడియాస్ పథకం’ ప్రారంభం
నాలుగేళ్లలో రూ.4 లక్షల కోట్ల ఎన్ పీఏలు వసూలు చేశాం
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల సాయం..బ్యాంకింగ్ రంగంలో ప్రక్షాళన
ఎయిరిండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం
ఎన్నారైలు 180రోజులు ఎదురుచూడకుండా సత్వరమే ఆధార్ కార్డుల జారీ
2019-20 ఆర్థిక సంవత్సరానికి నాలుగు కొత్త ఎంబసీల ఏర్పాటు
మహిళా నాయకత్వంలో సాగే పరిశ్రమలకు ప్రోత్సాహం
విద్యుత్ వాహనాల వినియోగం ప్రోత్సహానికి రూ.10,000 కోట్లు మంజూరు
బ్యాంకింగ్ లో రూ.లక్ష కోట్ల మేర తగ్గిన నిరర్ధక ఆస్తులు(ఎన్ పీఏ)