సీఎం జగన్ మనసుకు నచ్చిన పధకం అమ్మఒడి.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన పలు హామీలిచ్చారు. చిన్నారులందరూ బడికి వెళ్లాలని, ఉన్నత చదువులు చదవాలని, పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లుగా చేసేందుకు తల్లిదండ్రులు అప్పులపాలు కావొద్దని, పిల్లల చదువుకోసం తల్లిదండ్రులు పడే ఇబ్బందులు చూశానని, అందుకే ఈ పథకం ప్రకటించానని జగన్ చెప్పారు.
ఇందులో భాగంగా తమ పిల్లల్ని బడికి పంపించే మహిళలకు జనవరి 26న రూ.15 వేలు సాయం అందిస్తామని చెప్పారు. తద్వారా పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా పండుగదినం నిర్వహించి, తల్లుల చేతికి రూ.15వేలు ఇస్తామన్నారు. స్కూళ్లలో టాయిలెట్స్, ఫర్నీచర్ సరిగా ఉండవని, కార్పోరేట్ స్కూళ్లను ప్రోత్సహించారని విమర్శించారు. రాష్ట్రంలోని 40 వేల పాఠశాలల ఫోటోలు తీయించి, రెండేళ్ల తర్వాత జరిగిన అభివృద్ధిని మళ్లీ ఫోటో తీసి చూపిస్తామన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో పాటు తెలుగు సబ్జెక్ట్ను తప్పనిసరి చేస్తామన్నారు. అయితే ఈ పథకంపై గతంలో కన్ఫ్యూజన్ నెలకొంది. కేవలం ప్రభుత్వ పాఠశాలలకే ఇస్తారా ప్రయివేటు పాఠశాలలకు కూడా ఇస్తారా అని అంతా ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ఇవ్వాలని, ప్రయివేటు పాఠశాలలకు ఇస్తే ప్రయివేటీకరణను ప్రోత్సహించినట్లు అవుతుందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కొన్ని సవరణలు చేసి ప్రయివేటు పాఠశాలలకు కూడా వర్తింప చేయాలని సీఎం ఆదేశించారు. మనం ఇచ్చేది పాఠశాలలకు కాదు.. పిల్లల తల్లులకు ఇస్తున్నాం అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రైవేటు స్కూళ్లకు వర్తింప చేయాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ పథకం విధి విధానాలు అమలుపై నిర్ధిష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా రాలేదు. మరోపక్క అమ్మఒడి పథకం ద్వారా తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తామంటున్నారు కాబట్టి అమ్మ లేని పిల్లల పరిస్థితి ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా పెద్దలు తల్లిలేని పిల్లలకు అక్కడికక్కడ మాట్లాడించి పధకం వర్తింపచేయాలని చూస్తున్నారు. మరికొందరు మాత్రం తల్లి ఆధార్ కార్డు, ఇతర వివరాలు లేవు కాబట్టి ఆయా బిడ్డల సంరక్షణ చూసుకుంటున్నవారికి వర్తింపచేయలేం అంటున్నారు. కొన్నిచోట్ల వైసీపీ నేతలు, గ్రామాల్లోని పెద్దలు మాట్లాడి పిల్లలను స్కూళ్లలో చేర్చుతున్నా ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మఒడి వర్తిస్తుందో లేదో అనే సందిగ్ధం నెలకొంది. సీఎం ఈ అంశంపై మరోసారి స్పష్టమైన ప్రకటన చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అన్నఒడి అనే పేరుతో ఈ పధకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నారు.