ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి మరో నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వాసుపల్లి గణేశ్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నదీజలాల పంపకంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు సభకు ఆటంకం కలిగించారు. దీంతో స్పీకర్ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన నలుగురు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదించారు. వారంతా సభనుంచి వెళ్లాలని స్పీకర్ సూచించినా ఫలితం లేకపోవడంతో మార్షల్స్తో వారిని బయటకు పంపించారు. ఈ రోజు సభ ముగిసేవరకు స్పీకర్ ఈ నలుగుర్నీ సస్పెండ్ చేశారు. ఇటీవలే ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేవరకూ టీడీపీ సభ్యులైన అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామా నాయుడిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.