సోషల్ మీడియాను కొందరు దుర్వినియోగపరుస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడానికి, రాజకీయ పార్టీల అధినేతలను కించపర్చడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అసభ్యకరమైన రాతలతో, పోస్టులతో చెలరేగిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇతరులను కించపర్చడం..ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిపై ఇష్టానుసారం అసభ్యకర పోస్టులు పెట్టడం సైబర్ క్రైమ్ కింద వస్తుంది. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు కూడా. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూ ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టారు. దీంతో వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కృష్ఱా జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది.
ముఖ్యమంత్రి వైయస్ జగన్పై ఫేస్బుక్లో అసభ్యకర పోస్టింగ్లు పెట్టిన జగ్గయ్యపేటకు చెందిన చల్లపల్లి అవినాష్, చిల్లకల్లుకు చెందిన ఏనిక గోపీలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నాగేంద్ర కుమార్ తెలిపారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు జగ్గయ్యపేట పోలీసులు వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. సోమవారం అరెస్టు చేసిన నిందితులకు కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. సరిగ్గా నెలరోజుల క్రితం కూడా గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన పెద్దబోయిన వెంకట శివరావు అనే వ్యక్తిని సోషల్ మీడియాలో పోస్టుల నేపథ్యంలో గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ సానుభూతిపరుడైన ఈ శివరావు సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేక సీఎం జగన్పై, ఇతర వైసీపీ నేతలపై అభ్యంతకర పోస్టులు పెడుతున్నాడు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు శివరావును అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా జగ్గయ్యపేటకు చెందిన ఇద్దరు పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖ వ్యక్తులపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే తర్వాత జైలు వూచలు లెక్కపెట్టాల్సి వస్తుందని పోలీసులు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు.