మహిళలపై బీజేపీ నేతల అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ 17 ఏళ్ల యవతిపై బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెనెగర్ అత్యాచారానికి పాల్పడిన ఉన్నావ్ ఘటన ఇంకా మరువకముందే..మరో మాజీ బీజేపీ ఎమ్మెల్యే తన సొంత కోడలిపై అత్యాచారం చేసిన ఉదంతం చోటు చేసుకుంది. తాజాగా మావయ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షూకెన్ కోడలు సంచలన ఆరోపణలు చేశారు. గత ఏడాది డిసెంబరులో తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తమ్ముడిని, కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించినందు వల్లే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు… బాధితురాలికి ఢిల్లీలోని నంగ్లోయి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మనోజ్ షూకెన్ కొడుకుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో గతేడాది డిసెంబరు 31న భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లిన ఆమె ఆరోజు రాత్రే అత్తవారింటికి బయల్దేరారు. అప్పుడు ఆమె సోదరుడు, మరో కజిన్ కూడా వెంటే ఉన్నారు. అయితే మీరా భాగ్లో ఇంటికి తీసుకువెళ్లకుండా న్యూ ఇయర్ పార్టీ నిమిత్తం.. బాధితురాలి భర్త వారిని పశ్చిమ విహార్లో ఉన్న ఓ హోటల్కు తీసుకువెళ్లాడు. కానీ కాసేపటి తర్వాత బాధితురాలికి ఒంట్లో నలతగా ఉండటంతో అర్ధరాత్రి సమయంలో ఆమెను ఇంటి దగ్గర వదిలివెళ్లాడు.
ఈ క్రమంలో ఇంటికి చేరిన కోడలు ఒంటరిగా గదిలోకి వెళ్లడాన్ని గమనించిన మనోజ్ ఆమెను అనుసరించాడు. కొడుకు గురించి వాకబు చేస్తున్నట్లుగా ఆమెతో మాటలు కలిపి లోపలికి వచ్చి డోర్ లాక్ చేశాడు. అప్పటికే తాగి ఉన్న మనోజ్.. అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ బాధితురాలిని భయపెట్టాడు. దీంతో ఆమె కేకలు వేయడానికి ప్రయత్నించగా జేబులో ఉన్న గన్ తీసి కోడలి తలకు గురిపెట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఈ విషయం గురించి బయట చెబితే బాధితురాలి కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె మౌనంగా ఉండిపోయారు. అదే విధంగా భర్తకు చెబితే తన కాపురం కూలిపోతుందని భయపడ్డారు. అయితే గత కొంతకాలంగా మళ్లీ మనోజ్ ప్రవర్తనలో మార్పు రావడం, భర్త కూడా అనుచితంగా ప్రవర్తించడంతో అత్తవారింటిపై గృహహింస కేసు పెట్టిన బాధితురాలు.. తాజాగా మనోజ్ దురాగతాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసు నమోదైంది. కాగా ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సొంత కుమారుడి భార్యపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షూకెన్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపుతోంది.