ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ జాతీయ మీడియా – అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారునిగా నియమితులయ్యారు. ఈమేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా గురువారం అమర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభీష్టం ఉన్నంతవరకూ అమర్ ఈపదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని విధివిధానాలను మరో ఉత్తర్వుల్లో స్పష్టం చేయనున్నట్లు సదరు జీవోలో పేర్కొన్నారు. జాతీయ మీడియా సలహాదారుగా నియమించిన ఏపీ సర్కార్ ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. 1976లో ఈనాడు దినపత్రిక ద్వారా పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించిన ఆయన తన 43 ఏళ్ల కెరీర్లో ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికల్లో కీలక హోదాల్లో పనిచేశారు. ప్రజాతంత్ర పత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా సేవలు అందించారు. ప్రస్తుతం సాక్షిటీవీలో ఫోర్త్ ఎస్టేట్ పేరుతో డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో సాక్షి దినపత్రికకు కన్సల్టింగ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. 2004నుంచి09 వరకు ఐదున్నరేళ్లపాటు ఉమ్మడి ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా కేబినెట్ ర్యాంక్ హోదాలో పనిచేశారు. గతంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అమర్ ప్రస్తుతం ఐజేయూ అధ్యక్షుడిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది జర్నలిస్టుల సమస్యలపై పోరాడిన అమర్ కు ఈ పదవి రావడం పట్ల జర్నలిస్ట్ సంఘాల నేతలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.