ప్రస్తుతం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతున్న విషయం విదితమే. తాజా ఆకుకూరలు, కూరగాయలతో పాటు గుడ్లు, అరటిపండ్లు పిల్లలకు తప్పనిసరిగా ఆహారంగా ఇవ్వాలి.
కానీ కూరకు బదులుగా ఉప్పు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా.. విద్యార్థులకు రొట్టెలు ఇచ్చారు. ఈ రొట్టెలకు కూర ఏమీ ఇవ్వకుండా ఉప్పును ఇచ్చారు. రొట్టెకు ఉప్పును అంటించుకుని విద్యార్థులు తింటున్న దృశ్యాలను అలోక్ పాండే అనే జర్నలిస్టు తన ట్విట్టర్ పేజీలో దృశ్యాలను పోస్టు చేశారు.
అయితే ఒక రోజు అన్నం, ఉప్పు, మరో రోజు రొట్టె, ఉప్పు కలిపి ఆహారంగా ఇస్తున్నట్లు తేలింది. పాఠశాలకు పాలు, గుడ్లు, అరటి పండ్లు వచ్చినా కూడా అవి పిల్లల దాకా చేరవని ఓ విద్యార్థిని తండ్రి పేర్కొన్నారు. ఇలా గత సంవత్సర కాలం నుంచి జరుగుతుందన్నారు.