తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీరు అందుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. మిగతా సగానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీరివ్వాలని సీఎం చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే రేయింబవళ్లు, మూడు షిఫ్టుల్లో పనిచేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని, వచ్చే వర్షాకాలంలో సాగునీరు అందించాలని ఆదేశించారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న పనులపై, భవిష్యత్తులో జరగాల్సిన పనులపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, పంపు హౌజులు,కాలువల పనులను సమాంతరంగా చేపట్టాలని చెప్పారు. సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటన జరిపి, పనుల్లో వేగం పెంచాలని కోరారు. సమావేశంలో నీటి పారుదల ఇఎన్సి శ్రీ మురళీధర్ రావు, సిఇ శ్రీ రమేశ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags cm harish rao kaleshwaram kcr ktr palamoor rangareddy lift irigation slider trs