తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మద్దతు ధరతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్తో గతంలో ఉద్యమించిన రైతులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూర్ మార్కెట్ యార్డులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలకు అతీతంగానే సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఎన్నికల సమయంలో ఐదు రోజుల్లో పసుపు బోర్డును తీసుకొస్తానని హామీచ్చిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికలై అరవై రోజులవుతున్నా కానీ ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదు. దీంతో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత తమ సమస్యలు పరిష్కారం కాకపోవడం. కానీ పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటన ఇంత వరకు జరగలేదు.
అంతేకాకుండా పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పంటలు చేతికి వచ్చిన సమయంలోనే ఆందోళనలను నిర్వహించడం, ఆ సమయంలో ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా పంటలను తక్కువ ధరకైనా విక్రయించడం జరుగుతుంది.
దీనివల్ల నష్టపోతున్నామని రైతులు భావిస్తున్నారు. పంటలు చేతికి రావడానికి ఇంకా సమయం ఉండడంతో ఇప్పటి నుంచే ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చని రైతులు ఆలోచిస్తున్నారు. అందువల్ల కార్యాచరణను రూపొందించి ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తే కేంద్ర ప్రభుత్వం కదిలివచ్చి తమ పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.