తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో కీసరలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి.
వర్షాలు కురవాలన్నా, ఆక్సిజన్ లభించాలన్నా చెట్లే ఆధారం. కీసర గురించి మాట్లాడుకుంటే పవిత్రతకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు కీసర. ఇక్కడ పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంలో మన కృషి కూడా ఉండాలి. కీసరలోని 1550 ఎకరాల అడవిని కాపాడుకుందాం.
కీసరలో అర్బన్ పార్క్, టూరిజం ఏర్పాటు చేయడం నా లక్ష్యం. పని విషయంలో పట్టు వదలకుండా పూర్తి చేయడం సీఎం కేసీఆర్ నుంచి నేర్చుకున్నాను. కేటీఆర్ స్ఫూర్తితో ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నా. నేనిచ్చిన హామీలన్నీ నెరవేర్చాక ఆయన జన్మదిన వేడుకలు ఈ పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకుందాం.
రాష్ట్రవ్యాప్తంగా అందరు కూడా తమ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి. పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.