అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ అగ్రస్థానంలో నిలిచింది.. ఆస్తుల విలువలు పెరగడంతో అడ్డదారుల తొక్కుతున్నారు. ఈ
మోసాల అడ్డుకట్టకు సర్కారు చర్యలు తీసుకుంటోంది.. దీనిపై త్వరలో ఉత్తర్వులు చేయనున్నారు. మోసపూరిత డబుల్ రిజిస్ట్రేష్రన్లలో విజయవాడ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇటీవల మొత్తం 282 తప్పుడు/డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు రాగా అందులో ఒక్క విజయవాడ లోనే 84 ఉన్నాయి. రాష్ట్రం మొత్తం 26 రిజిస్ట్రేషన్ జిల్లాలుండగా ఆరింటిలో ఎటువంటి ఫిర్యాదులు లేవు. మిగిలిన 20 రిజిస్ట్రేషన్ జిల్లాలను చూస్తే ఒక్క విజయవాడలో 84, శాఖపట్నంలో 39, ఒంగోలులో 27, చిత్తూరులో 24, అనంతలో 20 అక్రమ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ మొత్తం ఫిర్యాదులపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విచారణ జరిపి 44 కేసులకు సంబంధించి ప్రాసిక్యూషన్ జరుగుతోంది.
స్థిరాస్తుల విలువలు పెరగడంతో భారీ మోసాలు జరుగుతున్నాయి. తమది కాని భూమిని యజమానులకు తెలియకుండా నకిలీపత్రాల ద్వారా అక్రమార్కులు విక్రయించేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. బాధితులు లబోదిబోమంటూ తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దుచేయాలంటూ ఫిర్యాదు చేస్తున్నారు. సివిల్ కోర్టుల ఆదేశాలు లేనిదే రిజిస్ట్రేషన్ను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి కూడా లేకపోవడంతో దూరప్రాంతాల్లో స్థిరపడిన వారి భూములు, స్థలాలపై కన్నేసి నకిలీ ఆధార్, పత్రాలు సృష్టించి యజమానులకు తెలియకుండానే అమ్మేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ స్థల యజమానులు వీటిని విక్రయించడానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లేవరకూ అసలు విషయం తెలియని పరిస్థితి.
ఈక్రమంలో రాష్ట్రప్రభుత్వం ఈఅక్రమాలకు అడ్డుకట్ట వేయాలని దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎవరైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిస్తే ప్రాసిక్యూషన్ చేయించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాంబ శివరావు తెలిపారు. ఒకవేళ సబ్ రిజిస్ట్రార్లు తప్పుచేసినట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మోసాల నియంత్రణకు ఆయన పలు సూచనలు చేశారు. స్థిరాస్తులను వేరే వారు విక్రయిస్తే వెంటనే ఛీటింగ్ కేసులు పెడతామన్నారు. వెబ్ల్యాండ్లో మోసాలు జరగకుండా భూ యజమానుల ఆధార్ నంబరు, ఫోన్ నంబరు నిర్వహించడం ద్వారా మోసాలకు అవకాశంలేకుండా చేయొచ్చని చెప్తున్నారు.