గోదావరిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ ఓఎన్జీసీ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపడుతున్నాయి. మూడ్రోజులుగా రాజమండ్రి, దేవీపట్నం, కచ్చులూరులో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటివరకూ మొత్తం మృతదేహాలను వెలికితీయలేకపోయారు. మూడోరోజు సెర్చ్ ఆపరేషన్స్ లోఎక్కడైతే బోటు మునిగిందో… అక్కడ లంగరేసి బోటును కదపడంతో మృతదేహాలు బయటికి వచ్చాయి. దాంతో ఒక్కరోజే 22 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటివరకు మొత్తం 30 మృతదేహాలను బయటికి తీసారు.
20 డెడ్బాడీస్కు పోస్టుమార్టం చేసి ప్రత్యేక అంబులెన్సుల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. మూడోరోజు వెలికితీసిన 22 మృతదేహాల్లో ఐదుగురిని తెలంగాణవాసులుగా గుర్తించారు. మూడ్రోజులుగా రాజమండ్రిలోనే మకాం వేసిన తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మునిగిపోయిన బోటులో మొత్తం73 మంది ఉండగా, 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికితీశారు. దాంతో ఇంకా 17మంది ఆచూకీ లభించాల్సిఉంది. వీళ్లంతా బోటులో ఇరుక్కుపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే, లోతైన నదీగర్భం 370 అడుగుల లోతులో బోటు మునిగిపోవడంతో బయటికి తీయడం కష్టమేనంటున్నారు అధికారులు.