కాకినాడ ఎంపీ వంగా గీతా కేంద్ర ఉక్కు, పెట్రోలియం – సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బుధవారం అధికారికంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓఎన్జీసీ కార్యకలాపాలపై గీత కేంద్రమంత్రితో చర్చించారు. ధర్మేంద్ర ప్రధాన్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సందర్శించి అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ ప్రజల తరఫున ఆమె కేంద్రమంత్రిని కోరారు. జిల్లాలో కాకినాడ కేంద్రంగా కేజీ బేసిన్ ఆపరేషన్ కార్యకలాపాలు, ఓఎన్జీసీ ఈస్ట్రన్ ఆఫ్షోర్ అసెట్స్, కైర్న్ ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీల కార్యకలాపాలన్నీ కాకినాడ ప్రధాన కార్యాలయంగా జరుగుతున్నాయని ధర్మేంద్ర ప్రధాన్కు గీత వివరించారు.
అయితే కాకినాడ హెడ్ క్వార్టర్ను మార్చి వేరేచోటుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయంపైనా ఆమె మంత్రితో చర్చలు జరిపారు. మొత్తం కార్యకలాపాలు కాకినాడ కేంద్రంగా కొనసాగించాలని కోరుతూ కాకినాడను హెడ్ క్వార్టర్గా గుర్తించాలని విన్నవించారు. కాకినాడనే హెడ్ క్వార్టర్గా గుర్తిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. త్వరలో తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తానని ఆయన తెలిపారు.