పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఈనేపధ్యంలో హికా తుపాను దూసుకొస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 85 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు హికా తుపాను వచ్చింది. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు హికా సిద్ధమైంది. రాగల 24గంటల్లో ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. వీటితోపాటుగా దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
హికా తుపాను ప్రభావంతో అరేబియా తీరంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరించారు. మరో 48గంటల్లో తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. యూపీ, రాజస్థాన్, విదర్భ, చత్తీస్ఘడ్, బెంగాల్లో కుంభ వృష్టి కురుస్తుందని, అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, బెంగాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశముందన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రోడ్ల పైకి నీరు చేరుతుండడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.