ఏపీయస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఏపీ సీఎం జగన్ లక్షలాది మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి ఏపీ ఆర్టీసీ కార్మికులు కార్పొరేషన్ ఉద్యోగులకు బదులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని బెనిఫెట్స్ ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ఏపీ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలని వివిధ ఆర్టీసీ యూనియన్లు, కార్మికులు, ఉద్యోగులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంజనేయరెడ్డి కమిటీ కూడా తమ నివేదికలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు సూచించినట్లు ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కమిటీ సిఫార్సు ప్రకారం సీఎం జగన్ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, ఈ మేరకు జీవో జారీ చేసినట్లు రవాణా శాఖ మంత్రి పేర్నీ నాని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల వయసు పెంపుతో రెండేళ్లు రిటైర్మెంట్ ఆగడం వల్ల సిబ్బంది కొరత తగ్గి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని అధికారులు అంటున్నారు. మొత్తంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ చిరకాల కోరికను నెరవేర్చిన సీఎం జగన్ ఫోటోను కచ్చితంగా ప్రతి ఇంట్లో పెట్టుకుంటామని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు.