తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మంత్రులు,నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలో కాల్వపల్లి తండ,కొత్త దోనబండ తండ,పాత దోనబండ ,జంలా తండ,బీల్యా నాయక్ తండ,నిమ్మ తండ,నాయక్ తండ,కామంచి కుంట తండాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ” గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలను ఎస్టీల కోసం ప్రవేశ పెట్టారు. ఆరు దశాబ్దాల గిరిజనుల కల అయిన తండాలను పంచాయతీలుగా చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో తండాల్లో స్వయంపాలన వచ్చింది. గిరిజన శాఖకు తెలంగాణలో చాలా ఎక్కువగా బడ్జెట్లో నిధులు కేటాయించారు.
నియోజకవర్గ కేంద్రంలో రూ కోటితో సేవాలాల్ భవనాన్ని నిర్మిస్తాం. అంతే కాకుండా రూ.30 కోట్లతో గిరిజన గురుకులాన్ని తీసుకువస్తాం అని అన్నారు. మంత్రి ఇంకా మాట్లాడుతూ”నియోజకవర్గంలో అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి అందిస్తాం. గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని “అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపీ మాలోత్ కవిత,ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్ ,రవీందర్ నాయక్,స్థానిక పార్టీ నేతలు ,జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచులు పాల్గొన్నారు.