హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆదివారం నాడు శ్రీ కాళేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. స్వామిజీ ఆగమనం సందర్భంగా ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. గర్భగుడిలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. యమస్వరూపుడిగా ఉండే కాళుడు, ముక్తి స్వరూపుడిగా ఉండే పరమేశ్వరుడు ఒకే పానపట్టంపై ఉండడం చాలా అరుదని స్వామిజీ తెలియజేశారు. అంతే కాకుండా నీలకంఠ శివాచార్య జన్మించిన ప్రదేశం కూడా ఇదేనని, ఈ ప్రాంతం నుంచే శైవమతం వ్యాప్తి చెందిందని స్వామిజీ గుర్తు చేసుకున్నారు. ముక్తి ప్రదాయని అయిన కాళేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని స్వామిజీ అన్నారు. పూజల అనంతరం స్వామిజీకి ఆలయ ఈవో, అర్చకులు కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. తదనంతరం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర..హృద్య గంగ అయిన గోదావరి నదీమతల్లికి పసుపుకుంకుమ, చీరను సమర్పించారు. కాళేశ్వరం డ్యామ్కు విచ్చేసిన స్వామిజీకి అధికారులు ప్రాజెక్టు నిర్మాణ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ…ఈ కాళేశ్వరం ప్రాజెక్టును అనతికాలంలోనే పూర్తిచేసిన తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భగీరథ ప్రయత్నానికి భగవంతుడి ఆశీస్సులు కూడా తోడయ్యాయని అన్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో యావత్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని స్వామిజీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలంగా ఉంచాలని గోదావరి తల్లిని ప్రార్థించానని ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ఆలయ ఛైర్మన్, ఈవో, అర్చకులతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు, హిందూ ధర్మ ప్రచారయాత్ర తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమన్వయకర్త గడిచర్ల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.