తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 62 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 11వ రోజైన మంగళవారం కూడా రాష్ట్రంలో ఎక్కడా సమ్మె ప్రభావం కనిపించలేదు.
రెండ్రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రి అజయ్ కుమార్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 4,192 మంది తాత్కాలిక డ్రైవర్లు, 4192 మంది తాత్కాలిక కండక్టర్లు విధులు నిర్వహించినట్టు తెలిపారు. 4,192 ఆర్టీసీ, 1,952 అద్దె బస్సులు కలుపుకొని 6,144 బస్సుల ద్వారా ప్రయాణికులకు సేవలందించినట్టు పేర్కొన్నారు.