ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలకు చౌక ధరకే నాణ్యమైన ఇసుక అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ నూతన ఇసుకవిధానం తీసుకువచ్చారు. అయితే భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నదులు, చెరువులు, వాగులు నిండుకోవడంతో ఇసుక తీసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కాస్త ఇరుక రవాణాకు ఇబ్బంది ఎదురవుతున్న విషయం నిజమే. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలు ఇసుక కొరతపై ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయి. సీఎం జగన్ వేలాది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల పొట్టగొడుతున్నాడంటూ జనసేనాని తప్పుపడుతున్నాడు. అంతే కాదు నవంబర్ 3 న వైజాగ్లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి భారీ కవాతుకు పవన్ సిద్ధమవుతున్నాడు. అయితే బాబు, పవన్ల విమర్శలకు వైసీపీ నేతలు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు.
తాజాగా వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇసుక కొరతపై బాబు, పవన్ల వ్యాఖ్యలకు స్పందించారు. గత ఐదేళ్లలో బాబు హయాంలో జరిగిన భూదోపిడీ, ఇసుక దోపిడీ ఎక్కడా జరగలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు..ఇప్పుడు టీడీపీ నేతలు ఇసుక గురించి మాట్లాడుతున్నారు కాని..గతంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుకను ఎలా దోచుకున్నారో..ఎన్ని వందల కోట్లు వెనకేసుకున్నారో లెక్కలతో సహా నాదగ్గర ఉన్నాయని..దమ్ముంటే చర్చిద్దాం రండి అంటూ టీడీపీ నేతలకు మంత్రి అవంతి సవాల్ విసిరారు.
ఇక ఇసుక కొరతపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శలకు స్పందించిన మంత్రి… పవన్ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీ పార్టీని టీడీపీలో కలిపేయాలనుకుంటే కలిపేయండి.. కానీ టీడీపీకి అద్దె మైక్లా మాట్లాడకండి అంటూ కౌంటర్ ఇచ్చారు..గత ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుక దోచుకున్నారని మీరే గతంలో విమర్శించారు..ఇప్పుడు ఇసుక కొరతకు బాబు సర్కార్ కారణం కాదా… టీడీపీ నేతల అవినితి, ఇసుక దోపిడీ మీకు ఎందుకు కనిపించడం లేదని మంత్రి పవన్ను ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం చిత్తశుద్దితో పారదర్శకంగా ఇసుక రవాణాకు కట్టుబడి ఉందని..అనసవరంగా విమర్శలు చేసి స్థాయి దిగజార్చుకోవద్దని..మంత్రి అవంతి పవన్కు హితవు పలికారు. పవన్ కల్యాణ్ విమర్శలకు మంత్రి అవంతి ఇచ్చిన కౌంటర్కు నెట్జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అవును…అన్న పార్టీని కాంగ్రెస్లో కలిపేశాడు..తమ్ముడు పార్టీని టీడీపీలో కలిపేస్తాడంటూ…నెట్జన్లు సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ విమర్శలకు అవంతి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు విశాఖ జిల్లాలో హాట్టాపిక్గా మారాయి. మరి మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై జనసేనాని ఎలా స్పందిస్తాడో చూడాలి.