దేశ ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య కేసుపై సుప్రీంకోర్ట్ చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. అయోధ్యలో వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమి హిందూవులకు దక్కుతుందని..సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలను తావు లేకుండా ఒకే తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లోగా రామమందిరం ట్రస్ట్ బోర్టుకు ఈ వివాదస్పద భూమిని అప్పగించాలని, ఈ మేరకు అవసరమైన నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ముస్లింలకు ప్రత్యామ్నాయంగా అయోధ్యలోనే 5 ఎకరాలు కేటాయించాలని, ఆ భూమిని మసీదు నిర్మాణం కోసం సున్నీబోర్డుకు అప్పగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని కేటాయించవచ్చని పేర్కొంది. ఇక షియాబోర్డు, నిర్మోహి అఖాడా సంస్థలు వేసిన పిటీషన్లను సుప్రీంకోర్ట్ కొట్టేసింది. తీర్పు సందర్భంగా సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రామలల్లా స్థలం దేశ శాంతిభద్రతలకు, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ప్రాంతమని పేర్కొంది. ఈ వివాదాస్పద స్థలంలో ముస్లింలు నమాజ్ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని చెప్పిన సుప్రీంకోర్ట్..అదే సమయంలో ఖాళీ ప్రాంతంలో మసీదు నిర్మించలేదని స్పష్టం చేసింది. ఆలయం ఉన్న చోటే మసీదును నిర్మించారనడానికి ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడనడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధారాలు నిర్థారించడం లేదని, అయితే చారిత్రక ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మొత్తంగా 134 ఏళ్లుగా రగులుతున్న ఈ వివాదానికి సుప్రీంకోర్ట్ ఇవాళ ముగింపు పలికింది. కాగా సుప్రీంకోర్ట్ తీర్పు ఎలా ఉన్నా గౌరవించాలని, అందరూ సమన్వయం పాటించాలని ఇప్పటికే..ముస్లింపెద్దలు, హిందూత్వ సంస్థలతో పాటు, వివిధ రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఈ చారిత్రాత్మక తీర్పు పట్ల వివిధ రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.