ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. పులివెందులలో రూ. 347 కోట్లతో నిర్మించనున్న వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. శంకుస్థాపనలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. వాటర్గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందజేస్తామని తెలిపారు. మొత్తంగా రూ. 1329 కోట్లతో నియోజకవర్గంలో తొలి దశ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.‘నాన్నను అమితంగా ప్రేమించారు.. ఇప్పుడు నా వెన్నంటే ఉంటున్నారు. మీ బిడ్డగా రుణంగా తీర్చుకుంటాను’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
అలాగే పులివెందుల మినీ సచివాలయానికి రూ. 10 కోట్లు, ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్ కోసం రూ. 20 కోట్ల కేటయిస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గండికోట రిజర్వాయర్ దిగువన 20 టీఎంసీల నిల్వతో డ్యామ్ నిర్మిచనున్నట్టు చెప్పారు. పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అంతకుముందు పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ కుటుంబసభ్యులు, ప్రజలతో కలిసి పాల్గొన్నారు. కాగా, నేటితో సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల జిల్లా పర్యటన ముగియనుంది.