విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం విశాఖకు రానున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఘన స్వాగతం పలకనున్నట్లు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి పార్టీని నడిపే అర్హత లేదని, విజయనగరం పర్యటనను హఠాత్తుగా ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకి అమరావతి తప్ప రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలపై ప్రేమ లేదని విమర్శించారు.
విశాఖలో వైసీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. ఒకవేళ అది నిజమని నిరూపిస్తే ఆ భూములు వారికే ఇచ్చేస్తామన్నారు. ఆలీబాబా అరడజను దొంగలు ఎవరో… దండుపాళ్యం గ్యాంగ్ ఎవరో త్వరలోనే తేలుతుందని హెచ్చరించారు. సుజనా చౌదరి లాంటి చీటర్ చెప్పే మాటలకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్కు మేమంతా రుణపడి ఉంటాం. సీఎం వైఎస్ జగన్ రాకతో విశాఖ నగరానికి మహర్దశ పట్టబోతుందని అమర్నాథ్ తెలిపారు.