ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని గగ్గోలు పెడుతున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ నినదిస్తూ..రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పాల్గొంటూ రాజధాని వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మూడు రాజధానులు వద్దని వాదిస్తున్న వారిలో, రాష్ట్రానికి జరిగే మేలుకన్నా చంద్రబాబు సేవలో తరించాలనే తాపత్రయం కనిపిస్తోంది. రాజకీయాల్లో పైసకు కొరగాని వారూ రంకెలేస్తున్నారు. బాబుకు భజన చేయాలనుకుంటే అభ్యంతరం లేదు కాని అవగాహన లేకుండా మాట్లాడొద్దు” అని అన్నారు.