రాజధాని ప్రాంతంలో అరాచక శక్తులు ఉన్నాయా.. వాటిని గుర్తించటంలో నిఘా సంస్థలు విఫలం అయ్యాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తోంది.. తాజాగా జరిగిన జాతీయ రహదారిపై రాస్తారోకో ముందుగా నిఘా వర్గాల సమాచారం సేకరించటంలో విఫలం అయ్యాయనే వాదనలు వాస్తవమేననిపిస్తోంది. అంతమంది పోలీసులు ఉన్న ప్రాంతంలోనే క్యాబినెట్ ర్యాంక్ కలిగిన చీఫ్ విప్పై దాడి జరగటంలో అక్కడ విధులలో ఉన్న పోలీసుల వైఫల్యమా లేక గమ్యస్థానం చేరాల్సిందే అనుకున్న ఎమ్మెల్యే అత్యుత్సాహమా అనేది అర్ధం కావట్లేదు.అసలు జాతీయ రహదారి దిగ్బంధంకు పిలుపుపై ముందస్తుగా రైతులు ఎటువైపు నుంచి వస్తారు. రహదారి మార్గాలు ఎటువైపు ఉన్నాయి, స్థానికులు ఎవరు, స్థానికేతరులే7వరు అని నిఘా వర్గాలు పసిగట్టలేకపోయాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉదయం 9.30 ల వరకు ప్రశాంతంగా ఉన్న జాతీయ రహదారిపై అంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఎక్కడ నుంచి, ఎటు నుంచి వచ్చారు.?
ఇదే ప్రాంతంలో మంగళగిరి ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా కొందరు వ్యక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం స్థానిక వైసీపీ నేతలను కలవరపెడుతొంది. పలు గ్రామాల్లో నేటికి ఇతర ప్రాంతాలనుంచి వచ్చి తలదాచుకుంటున్నారని వారి ఆరోపణ. సోషల్ మీడియాలో పోస్ట్ లతో ప్రజా ప్రతినిధులనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ, వారి పర్యటనలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారంతో మంగళగిరి వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపు ఉదయం ఎమ్మెల్యే ఆర్కే నిడమర్రుకు వస్తున్నారని తెలుసుకున్న కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే పర్యటనకు అడ్డుతగలాలనే దురుద్దేశంతో ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని దయచేసి గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రూరల్ సీఐ శేషగిరిరావుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆర్కే పర్యటన కాకరేపుతుందా లేక శాంతియుతంగా జరుగుతుందా అనే అనుమానాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.