ఏపీ అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన చంద్రబాబు, లోకేష్, టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వివరాలను బయటపెట్టారు. అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయచ్చు అని ముందే భావించిన చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు, పారిశ్రామికవేత్తలు ఇన్సైడర్ ట్రేడింగ్ కింద రైతులను మభ్యపెట్టి భూములు కొట్టేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి బుగ్గర రాజధానిలో బాబు, లోకేష్లతో సహా ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడని టీడీపీ నేతల వివరాలను అసెంబ్లీలో చదివి వినిపించారు.
తాడికొండ మండలం కంతేరులో చంద్రబాబు కుటుంబసభ్యులు హెరిటేజ్ కోసం 14 ఎకరాలు కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. లంకా దినకర్, వేమూరి రవికుమార్, పరిటాల సునీత పేర్లపై ఈ భూములను కొనుగోలు చేశారన్నారు. ఇక టీడీజీ మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు కుటుంబం 40 ఎకరాలకు పైగా భూములు కొన్నదని బుగ్గన పేర్కొన్నారు. వీరితో పాటు తమ కుటుంబసభ్యుల పేర్ల మీద లింగమనేని రమేష్ చౌదరి , పయ్యావుల కేశవ్ చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, కంభంపాటి రామ్మోహన్రావు చౌదరి, మురళీమోహన్ చౌదరి భూములు కొనుగోలు చేశారని బుగ్గన వివరించారు.
అసలు విజయవాడకు దూరప్రాంతాలుగా ఉన్న తుళ్లూరులో వీరు ముందే భూములు ఎలా కొన్నారని ప్రశ్నించారు. నారాయణ, సుజనా చౌదరి వంటి నేతలు, బినామీ పేర్ల మీద కూడా టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. బినామీ వేమూరి రవి పేరు మీద నారా లోకేష్ భూములు కొన్నారని బుగ్గన పేర్కొన్నారు. పరిటాల సునీత వంటి అనంతపురం నేతలకు మందడం ఊరు ఉందని ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఇక ఏజీగా పనిచేసిన సమయంలోనే దమ్మాలపాటి శ్రీనివాస్ భూములు కొన్నారని బుగ్గన తెలిపారు. మొత్తంగా అసెంబ్లీలో లోకేష్తో సహా ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడిన టీడీపీ నేతల వివరాలను బుగ్గన ప్రకటించడంతో ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.