జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్కు, ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్రావుకు మధ్య గత కొద్దికాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ఒకపక్క సీఎం జగన్పై పవన్ రోజుకో అంశంతో తీవ్ర విమర్శలు చేస్తుంటే..రాపాక మాత్రం సమయం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసిస్తూ..సీఎం జగన్ను దేవుడిలా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రెండు సార్లు స్వయంగా జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి సంచలనం రేపారు. ఇంగ్లీష్ మీడియం విషయంలోకాని, మూడు రాజధానుల విషయంలో కానీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ.. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరును రాపాక కడిగిపారేశారు. అంతే కాదు స్వయంగా తనకు, పవన్కూ విబేధాలున్నాయని అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు కూడా… కాగా రాపాక తీరుపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. తక్షణమే రాపాకను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా పవన్ను డిమాండ్ చేస్తున్నారు. అయితే పవన్ మాత్రం ఉన్న ఒక్క ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోతుందనో….లేకుంటే దళిత ఎమ్మెల్యేను పార్టీ నుంచి సాగనంపారన్న అపవాదు వస్తుందనో, మరే ఇతర కారణాలు ఏమున్నాయో కానీ… రాపాక విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
తాజాగా ఏపీలో అధికార వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టింది. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును ఆమోదింప చేసేందు అధికారపక్షం సిద్ధంగా ఉంటే..బిల్లును అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుపై ప్రభుత్వానికి మద్దతు పలుకుతారా..లేకుంటే..పార్టీ స్టాండ్ ప్రకారం వ్యతిరేకిస్తారా అనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే రాపాక వరప్రసాద్కు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని పార్టీలోని అన్ని స్థాయిలలో నిర్ణయం తీసుకున్నామని.. దానికి అనుగుణంగానే సభలో వ్యవహరించాలని రాపాకను లేఖలో కోరారు.
ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ రీజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్మెంట్ యాక్ట్ 2020 బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెడుతున్న సందర్భంగా…ఓటింగ్కు హాజరై.. పార్టీ స్టాండ్ ప్రకారం వ్యతిరేకించాలని రాపాకను లేఖలో పవన్ కోరారు. అయితే పవన్ రాపాకకు బహిరంగ లేఖ రాయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఉత్తరాంధ్ర, సీమప్రజల ఆకాంక్షలను గమనించకుండా..కేవలం చంద్రబాబు కోసం అమరావతికి వంతపాడుతున్నావు.. గతంలో నాదెండ్ల మనోహర్ అహంకారంతో దళిత ఎమ్మెల్యే అయిన రాపాకను కించపరుస్తుంటే నవ్వుతూ చోద్యం చూశావు.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడలేని అహంభావమా..లేక రాపాక ప్రభుత్వం చేసే మంచి పనిని సమర్థిస్తున్నాడనే కోపమా… ఆఖరకు మీ ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాసే దుస్థితికి దిగజారిపోయావు..మరీ ఇంత ఇగో ఎందుకు పవనూ అని నెట్జన్లు మండిపతున్నారు.. మొత్తంగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాయడం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారింది.