ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అమరావతి రైతులతో సమావేశమైన పవన్ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి గారూ.. మీకు ఒక్కటే చెబుతున్నా.. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదని శపథం చేశారు. రైతులు, మహిళల్ని ఏడిపించిన వారు సర్వనాశనమేనని, వైసీపీ మట్టికొట్టుకుపోతుందంటూ శాపనార్థాలు పెట్టారు. జగన్ రెడ్డిని మూడు కాదు 30 రాజధానులు పెట్టుకోమనండని, 30 రాజధానులు కలిపి మళ్లీ ఒక్క రాజధానిగా చేసి తీరుతామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే సీఎం జగన్పై పవన్ చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యేలు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ మాట్లాడుతూ…ఒక వ్యక్తికి ముగ్గురు పెళ్లాలుంటే తప్పు గానీ… రాష్ట్రానికి మూడు రాజధానులు వుంటే తప్పేంటి? అంటూ పరోక్షంగా పవన్ మూడు పెళ్లిళ్లపై సెటైర్ వేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిలకడ లేదు. ఒక సిద్ధాంతం, విధానం కూడా లేవు… మాట మార్చడంలో ఆయనకు చంద్రబాబు ఆదర్శమని అమర్నాథ్ అన్నారు. పవన్కు వ్యక్తిగత జీవితంలో గ్యాప్ లేదు… అలాగే రాజకీయ జీవితంలో కూడా గ్యాప్ లేకుండా ఎవరినో ఒకరిని తోడు పెట్టుకుంటున్నారంటూ టీడీపీ, బీజేపీలతో పొత్తును ఉద్దేశిస్తూ…అమర్నాథ్ ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా బీజేపీతో కలిసి పవన్కల్యాణ్ నిర్వహించేది లాంగ్ మార్చ్ కాదు, రాంగ్ మార్చ్ అని అన్నారు… విశాఖకు రాజధాని రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారని మండిపడ్డారు. మొత్తంగా జగన్ రెడ్డి అంటూ పవన్ చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతలు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో పవన్పై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారాయి..