ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభలో ఆమోదించాల్సి ఉంటుంది…అప్పుడే అధికారికంగా ఏపీ శాసనమండలి రద్దవుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 30 న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా శాసనమండలి రద్దు బిల్లును ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం శాసన మండలి రద్దు అంత ఈజీ కాదని కేంద్ర ప్రభుత్వం బిల్లును కోల్డ్ స్టోరేజీలో పెడుతుందని..కనీసం ఆమోదం చెందడానికి రెండేళ్లు పడుతుందని వాదిస్తోంది. దీంతో శాసన మండలి రద్దుకు కేంద్రం ఓకే చెబుతుందా..పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం లభిస్తుందా అనే చర్చ జోరుగా సాగుతుంది.
తాజాగా కౌన్సిల్ రద్దుపై కేంద్రం వైఖరి ఎలా ఉండబోతుందనేదానిపై ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాసనమండలి రద్దు కావడం దురదృష్టకరమని ఆన్న మాధవ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఆమోదం పొందిన మండలి రద్దు బిల్లు పార్లమెంట్ లోనూ ఆమోదం పొందడం లాంఛనమే. దీనికి ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు ఉండబోవని తేల్చిచెప్పారు. కాగా ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో విడత సెషన్స్ మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగనున్నాయి. బడ్జెట్ పై చర్చల వేడి తగ్గిన వెంటనే ఏపీ మండలి రద్దు బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ నెలవరకు శాసనమండలి రద్దు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ శాసనమండలి రద్దు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి..మోదీ సర్కార్ దీనిపై పెద్దగా అభ్యంతరం పెట్టకపోవచ్చు అని..బడ్జెట్ సమావేశాల్లోనే ఉభయసభలో ఆమోదించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా మండలి రద్దు అంత ఈజీ కాదంటూ బుకాయిస్తున్న చంద్రబాబుకు, ఆయన అనుకుల మీడియాకు కేంద్రం గట్టిషాకే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.