కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కార్ నిరాశే మిగిలించింది. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చెయ్యి చూపడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరిగిరి మాన్యాలు పట్టినట్లే అని మండిపడ్డారు. కాగా ఏపీకి కూడా బడ్జెట్లో కేంద్రం మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర వైసీపీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణంలో పార్టీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి వ్యవసాయాధారిత రాష్ట్రంపై వివక్ష చూపడం సరైంది కాదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని ఎదురు చూశామని అయితే ఆ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు రావాల్సిన రూ.24,350 కోట్ల గురించి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆర్థిక లోటును నియంత్రించేందుకు ఆహార సబ్సిడీ, వ్యవసాయ రుణాలు మాఫీ చేయడాన్ని వీలైనంత వరకు తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోందని.. ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రం కాబట్టి దీనిని పరిశీలించాలన్నారు.
బడ్జెట్లో మొత్తం రూ.15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ప్రకటించారని.. ఇందులో వివక్ష లేకుండా ఏపీ వాటా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జల్జీవన్కు 3.5 లక్షల కోట్లు కేటాయించడం మంచి పరిణామమని..అయితే పోలవరం చెల్లింపులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. తీవ్ర నీటి ఎద్దటి ఉన్న 100 జిల్లాల్లో సమగ్ర నీటి సరఫరా పథకాలు అమలు చేస్తామన్నారని.. అందులో ఏపీకి కూడా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాని ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఎంతో సాయం వస్తుందని ఎదురు చూశామని, అయితే కేంద్రం మొండిచేయి చూపిందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర హక్కులు, వాటాను సాధించుకుంటామని విజయసాయిరెడ్డి వివరించారు. మొత్తంగా బడ్జెట్లో ఏపీకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. రాజకీయకోణంలోనే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండిచెయ్యి చూపుతుందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.