ఏపీలో వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అంటూ గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ భవిష్యత్తు ఏంటని…రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు మాత్రమే అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్నారు. కాగా అందులో ప్రధానంగా తుళ్లూరు, మందడం, వెలగపూడి వంటి ఐదారు గ్రామాల రైతులు మాత్రమే తీవ్ర స్థాయిలో ఆందోళనలను నడిపిస్తున్నారు. అమరావతి రైతుల ఆందోళలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గరుండి నడిపిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న రాజధాని రైతుల్లో మెజారిటీ శాతం చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారే అని అధికార వైసీపీ విమర్శిస్తోంది. కేవలం తన సామాజికవర్గం ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి పేరుతో కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే తాజాగా సీనియర్ రాజకీయవేత్త, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మూడురాజధానుల వ్యవహారంపై, అమరావతి రైతులపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ గుంటూరుల మధ్య మూడు పంటలు పండే సారవంతమై భూముల్లో అమరావతి పేరిట రాజధాని ఏర్పాటు చేశారని…ఉండవల్లి అన్నారు. రాజధాని అమరావతి మొత్తం కులం కార్డు మీదనే తిరుగుతుందని ఆరోపించారు. రాజధానికి 33 వేల ఎకరాలు దేనికని గతంలోనే అడిగానని ఉండవల్లి అన్నారు. ప్రస్తుతం ఏపీ ఇబ్బందుల్లో ఉన్న కారణంగా అమరావతిలో సేకరించిన 33 వేల ఎకరాల్లో రాజధాని ఏర్పాటు చేయడం అసాధ్యమని ఉండవల్లి కుండబద్ధలు కొట్టారు.
ఇక గత 50 రోజులుగా రాజధానిని తరలిస్తున్నారంటూ నిరసన తెలుపుతున్న అమరావతి రైతులు తాము రాజధాని కోసం భూములను త్యాగం చేశామని చెప్పడంపై ఉండవల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు రాజధాని రైతులు చేసింది త్యాగమే కాదు…గత టీడీపీ ప్రభుత్వానికి, అమరావతి రైతులకు మధ్య కుదిరిన పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం భూములిచ్చాం…త్యాగం చేశామని రైతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న ఆయన…తమ భూములను ఉచితంగా ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. రాజధానికి భూములిచ్చినందుకు పరిహారంగా రెసిడెన్షియల్ కమర్షియల్ ఫ్లాట్లను తీసుకోవడం లేదా అని రాజధాని గ్రామాల రైతులను ఉండవల్లి ప్రశ్నించారు. రాజధాని భూముల వ్యవహారంలో పరస్పర లబ్ధి ఉన్నది తప్పించి రైతుల త్యాగం ఎక్కడుందని కూడా ఉండవల్లి నిలదీశారు. అయితే ఇప్పుడు రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయాలనుకుంటున్న వైయస్ జగన్ ముందు రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటిని ఓ కొలిక్కి తీసుకువచ్చిన తర్వాతే…మూడు రాజధానులపై ముందడుగు వేయాలని సూచించారు.