ఏపీలో అధికార. పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు నినాదంతో గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలను నడిపిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటూ జేఏసీని ఏర్పాటు చేసి…జిల్లాలలో తిరుగుతూ జోలె పట్టుకుని భిక్షాటన చేస్తూ.. రాజధాని ఆందోళనలను ఉద్యమంగా మల్చాలని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. కాగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దీంతో అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితమైంది. అదీ చంద్రబాబు సామాజికవర్గం ఎక్కువగా ఐదారు గ్రామాల్లోనే ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి.
అయితే కేవలం తన సామాజికవర్గ ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి పేరుతో రచ్చ చేస్తున్నారని అధికార పార్టీ విమర్శిస్తోంది. గత ఐదేళ్లలో చంద్రబాబు అమరావతిని ప్రజారాజధానిగా గాకుండా.. కుల రాజధానిగా చేశారన్న ఫీలింగ్ ఏపీ ప్రజల్లో బలంగా నెలకొంది.అదే టీడీపీ ఘోర పరాజయానికి కారణం కూడా అయింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా..మిగతా సామాజికవర్గాలు అమరావతి ఉద్యమానికి పెద్దగా మద్దతు పలకడం లేదు. చంద్రబాబు కులపిచ్చే చివరకు రాజధాని రైతులు వీధున పడే పరిస్థితికి తీసుకువచ్చిందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా చంద్రబాబు కులపిచ్చిపై ఆయన సామాజికవర్గానికే చెందిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రెచ్చగొట్టే మాటలు నమ్మితే యువత జీవితాలు నాశనమవుతాయని శివకుమార్ అన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గం ఉన్న ప్రాంతాల్లోనే బాబు మీటింగులు పెడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ‘ఒక్కరోజు జైలుకెళ్లినా పరవాలేదని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. తన కుమారుడు లోకేష్ బాబును జైలుకు పంపుమంటే పంపుతారా..? నేను కూడా కమ్మ కులానికి చెందినవాడినే…కమ్మ సామాజిక ప్రజాప్రతినిధిగా మన మేలు కోసం చెప్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మి జీవితాలు పాడుచేసుకోవద్దు’ అని శివకుమార్ రాజధాని గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు. మొత్తంగా చంద్రబాబుకు ఆయన సామాజికవర్గానికే చెందిన రాజధాని ప్రాంత ఎమ్మెల్యే క్లాస్ పీకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.