విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్లు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచానికి కరోనా వైరస్ పడితే..ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని సెటైర్ వేశారు. ఈ చంద్రన్న వైరస్కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని ఎద్దేవా చేశారు. విశాఖలో భూకుంభకోణం జరిగిందంటూ టీడీపీ తమపై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఫైర్ అయ్యారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారికి లోకమంతా అలాగే కనపడుతుందని అన్నారు. టీడీపీ హయంలో వేల ఎకరాలు కబ్జా అయిపోయాయని ఆరోపించారు.
చంద్రబాబుకు నేను…నా 3 గ్రామాలు.. నా 33 వేల ఎకరాలు’ అనే మాట తప్ప మరో మాట కూడా రాలేదని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు గానీ అమరావతిలో బినామీల పేరిట కొనుగోలు చేసిన 33 వేల ఎకరాల భూములు ఏమీ కాకూడదని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఇక విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాన్ సమయంలో రికార్డులు పోయాయంటూ టీడీపీ నేతలు భూ కుంభకోణాల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. గడచిన 14 ఏళ్లలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని అమర్నాథ్ సవాల్ విసిరారు. గతంలో రాయలసీమలో కోట్ల విజయభాస్కర్రె డ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డిలాగా సింహం లాంటివారు పుట్టిన ఈ గడ్డపై నక్కలాంటి మా అల్లుడు ఎలా పుట్టాడో అని చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారని గుర్తుచేశారు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కూడా వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన గ్లాస్ పగిలిపోయిందని, పవన్ కల్యాణ్ కూడా ఆ పార్టీ గుర్తులాంటివాడేనని అమర్నాథ్ వెటకారం ఆడారు. అందరికీ ఉండాల్సిన రాజకీయ స్థిరత్వం, సిద్ధాంతం, వ్యక్తిత్వం పవన్ కల్యాణ్కు లేవన్నారు. పవన్ కు తెలిసిందల్లా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటమే అంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. కాని ఒక్క విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ చెప్పింది చేస్తున్నాడని అన్నారు. గతంలో ఓ బహిరంగ సభలో చెప్పిన మాట ప్రకారం ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన బాగుండడం కారణంగానే పవన్ గడ్డాలు తీసేసి సినిమాలకు సిద్ధమయ్యాడని గుడివాడ చెప్పుకొచ్చారు. మొత్తంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.