మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి కమీషన్ల బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ బట్టబయలు చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు అకస్మాత్తుగా హైదరాబాద్కు పయనమయానట్లు వార్తలు వస్తున్నాయి. రూ. 2 వేల కోట్ల బినామీ సొమ్ము లెక్కలు బయటపడిన క్రమంలో.. గురువారమే హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడుల్లో తన మాజీ పీఎస్ నుంచి అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకోవడంతో.. నిన్న రాత్రి నుంచి న్యాయవాదులు, తన ఆడిటర్లతో బాబు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రంగా చేసుకుని మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలు, బోగస్ సబ్ కాంట్రాక్టర్లను రాకెట్గా ఏర్పాటు చేసి.. భారీ నగదు కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లూవాలియా గురువారం విడుదల చేసిన ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అధికంగా బిల్లులు చెల్లించినట్లు చూపడం (ఓవర్ ఇన్వాయిసింగ్), బోగస్ బిల్లులు సృష్టించడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని వెల్లడించింది. ఇందుకు సంబంధించి తిరుగులేని ఆధారాలను సేకరించామని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐటీ సోదాల్లో చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో పలు కీలక డైరీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.