పెద్దల సభకు పంపే నాయకులను ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీనుంచి నాలుగు సీట్లు ఖాళీ కానుండడంతో మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అన్నీ సీట్లను వైసీపీ కైవసం చేసుకోనుంది. అయితే ఆ నలుగురిలో ముగ్గురిపై స్పష్టత వచ్చింది. పెద్దల సభకు వెళ్లే నలుగురిలో ఇద్దరు రాజకీయ నాయకులుగా మారిన పారిశ్రామికవేత్తలని, మరొకరు జగన్కు అత్యంత విధేయుడైన మంత్రి అని తెలుస్తోంది. మొదటిగా ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేరు వినిపిస్తోంది. రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం స్మిలాక్స్, ట్రాడాక్స్, ఆర్.వాక్ సంస్థల్లో బోర్డు మెంబర్గా కొనసాగుతున్న ఈయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా నర్సరావుపేట లోక్సభ నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు.
2019లో అక్కడినుంచి శ్రీకృష్ణదేవరాయులు పోటీచేసి గెలుపొందగా, అయోధ్య పోటీకి దూరంగా ఉండిపోయారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన ఆళ్ల వైసీపీకి ఆర్థికంగా వెన్నంటి నిలిచారు. అయోధ్యరామిరెడ్డి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత సోదరుడు. అలాగే ఇటీవల టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావును రెండో అభ్యర్థిగా జగన్ ఎంపిక చేసారట. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు.. పార్టీకి కొత్తే అయినా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి బీదా అత్యంత సన్నిహితుడుగా తెలుస్తోంది. బీదా, విజయసాయి గతంలో కలిసి ఉద్యోగం చేసిన వ్యక్తులు.
అలాగే ఆర్థికంగా స్థితిమంతుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీదా.. ఈయనకు రాజ్యసభ ఇవ్వడం ద్వారా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డికి పోటీ లేకుండా చేయొచ్చని భావిస్తున్నారు. అలాగే మూడో వ్యక్తి సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు మంత్రి మోపిదేవి.. మోపిదేవి మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు. జగన్కు అత్యంత నమ్మకస్తుల్లో తొలి నాలుగైదు పేర్లలో మోపిదేవి పేరు చెప్పుకుంటుంటారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయినా మోపిదేవిని జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తాజాగా శాసనమండలి రద్దుచేస్తూ తీర్మానం చేసిన నేపథ్యంలో మోపిదేవికి పదవీ గండం ఏర్పడింది. దీంతో ఆయన్ను రాజ్యసభకు తప్పక పంపుతున్నారు.