విశాఖ విమానాశ్రయ చరిత్ర మరో మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నంలోని విమానాశ్రయం నుండి ఇకపై చెన్నై, కోల్ కతా వంటి ప్రాంతాలకు కార్గో విమానాలను సైతం నడుపుకునేందుకు కేంద్ర రక్షణశాఖ అనుమతినిచ్చింది.. విశాఖ నుండి ఇకనుండి రవాణా విమానాలు నడిపించేందుకు ప్రముఖ ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ ముందుకొచ్చింది. ఈనెల 15నుంచే తొలి కార్గో విమానం టేకాఫ్ కావాల్సి ఉన్నా.. రక్షణశాఖ నుంచి అనుమతులు రావడం ఆలస్యంగా రావడంతో సర్వీసుల ప్రారంభం ఆలస్యమైంది. అయితే స్పైస్ జెట్ కోరిన సమయాల్లో కార్గో సేవల నిమిత్తం కేటాయించే పరిస్థితి లేవని రక్షణశాఖాధికారులు స్పష్టం చేయడంతో ఇక ఇక్కడినుండి కార్గో సేవలు కలే అని అందరూ భావించారు.
అయితే వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకొచ్చారు. ఢిల్లీ వెళ్లి పలువురి కేంద్ర మంత్రులకు పరిస్థితి వివరించారు. విశాఖనుంచి కార్గో విమానాల అవసరాన్ని విన్నవించారు. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారనుందని, ఈసమయంలో రాజధాని అవసరాల రీత్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రవాణాకు కార్గో అవసరమని కాబట్టి విశాఖలో కార్గో సర్వీసులకు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరడంతో రక్షణశాఖ సానుకూలంగా స్పందించింది. ఈక్రమంలో ఈనెల 25నుంచి చెన్నై- విశాఖ- కలకత్తా, చెన్నై- విశాఖ – సూరత్ రూట్లలో కార్గో విమాన సర్వీసులు నడుపుతామని స్పైస్ జెట్ ప్రకటించింది. ప్రస్తుతం డే బై డే సర్వీసులు నడుస్తాయని తర్వాత రెగ్యులర్ అవుతాయని స్పైస్ జెట్ ప్రతినిధి వెల్లడించారు.