ఎక్కడైన సరే ‘నాయకులు ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు.. కానీ, మేము ఓట్లు అయిపోయినంకా సేవ చేద్దామని మీ ముందుకు వచ్చాం.. పట్టణాలను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ‘పట్టణ ప్రగతి’ని ప్రారంభించారు.. సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవా లి.. రెండు నెలల తర్వాత మళ్లీ వార్డుల్లో పర్యటిస్తా’నని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మంగళవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని 15వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ జయమ్మ, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పట్టణ ప్రగతిలో మంత్రి పాల్గొన్నారు. ఇందులోభాగంగా వార్డుల్లో నడుస్తూ సమస్యలు తెలుసుకున్నారు. 65వ నంబరు జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాన్ని పరిశీలించి శుభ్రం చేసుకోవాలని భూయజమానికి సూచించారు.
ఇండ్ల ముందు నీటిగుంతలు పూడ్చుకోవాలని మహిళలను కోరారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కొత్త మున్సిపల్ చట్టంపై పట్టణవాసులకు అవగాహన కల్పించారు. సదాశివపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.