కాషాయపార్టీలో ఉన్నా..ఇంకా పచ్చ పార్టీ నేతలుగా భావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ బీజేపీ ఎంపీలు వంతపాడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లు ఇంకా చంద్రబాబు పాట పాడుతూనే ఉన్నారు. అయితే వికేంద్రీకరణపై మాత్రం సుజనా చౌదరి చంద్రబాబుకు మద్దతుగా అమరావతికి జై కొడితే..టీజీ వెంకటేష్ మాత్రం మొదటి నుంచి మూడు రాజధానులకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక సీఎం రమేష్ తటస్థంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఏపీలోె మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత 71 రోజులుగా అమరావతి రైతులతో ఆందోళనలు చేయిస్తూ..రాష్ట్రమంతటా చంద్రబాబు తిరుగుతుంటే..ఒకప్పటి ఆయన సన్నిహితుడైన ఎంపీ టీజీ వెంకటేష్ మాత్రం కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్కు ధన్యవాదాలు తెలపడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
తాజాగా కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బీజేపీ నేత, ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలులోని దిన్నెదేవరపాడులో జరిగిన పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరై నూతన వధూవరూలను ఆశీర్వదించారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఫిబ్రవరి 27న ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఓర్వకల్లు విమానశ్రయానికి సీఎం జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు విమానశ్రయంలో సీఎం జగన్కు ఎంపీ టీజీ వెంకటేశ్తో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్తో టీజీ వెంకటేశ్ల మధ్య అసక్తికర చర్చ జరిగింది. తమకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందని సీఎం జగన్ను ఎంపీ టీజీ కోరగా.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరామని, నివేదిక కూడా పంపించామని జగన్ వివరించారు. కాగా రాయలసీమ డిక్లరేషన్లో, బీజేపీ మేనిఫెస్టోలో కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశం ఉండటంతో కేంద్రం నుంచి త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చని సీఎం జగన్తో ఎంపీ టీజీ వెంకటేశ్ చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా ముఖ్యమంత్రి జగన్ను కలిసి సత్కరించి ముచ్చటించారు. ఇప్పుడు కర్నూలులో రాజధాని ఏర్పాటు నేపథ్యంలో టీజీ వెంకటేష్ కూడా సీఎం జగన్ను కలిసి అభినందించడంపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.