బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపల్ కేంద్రంలో పట్టణ ప్రగతిలో భాగంగా గల్లి గల్లి తిరిగి సమస్యలు తెలుసుకున్నామని, ప్రణాళికతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి గురువారం నాడు భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో 10 వ వార్డు హరిజనవాడలో ను, రెండవ వార్డు లోనూ కలెక్టర్ నారాయణరెడ్డి ఇతర అధికారులతో కలిసి గల్లి గల్లి తిరిగి ప్రజలతో మాట్లాడి స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎక్కడికక్కడ మున్సిపాలిటీ, విద్యుత్తు తదితర శాఖల అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. హరిజనవాడలో నీరు ఆగిన చోట పరిశీలించి వెంటనే ఆ గుంతను పూడ్చివేసి అక్కడ కొత్తగా మోరి నిర్మాణం చేసి నీరు బయటకు వెళ్ళే విధంగా చూడాలన్నారు. మరోచోట మురుగుకాలువ కిందికి ఉండడం వల్ల నీరు నిలిచిపోయినందున ఆ సమస్య పరిష్కారం కనుగొనాలని మున్సిపల్ ఇంజనీర్ ను ఆదేశించారు. తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వాటిని వెంటనే తొలగించి కొత్తవాటిని వేయాలన్నారు. కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని ఆదేశించారు. శుభ్రం చేయగా వచ్చిన చెత్తను వెంటనే డంపింగ్ యార్డ్ కు తరలించాలని ఆదేశించారు. కొన్నిచోట్ల ప్రజలు వేసిన చెత్తను పరిశీలించి వేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని అవగాహన ఏర్పాటు చేసుకోవాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లడానికి కృషి చేస్తామన్నారు. మన గల్లీలు, మన ఊర్లు మనవాళ్లు బాగుంటేనే పల్లెలు పట్టణాలు బాగుపడతాయని ప్రజల సమస్యలు తెలుసుకుని అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధి కనిపిస్తుందని ఆ దిశగా ఆలోచిస్తున్నా మన్నారు. భీమ్గల్ లో మరొసారి తిరిగి అన్ని సమస్యలను పరిష్కరించడానికి తాను, జిల్లా కలెక్టర్ ఆలోచన చేశామన్నారు. అదేవిధంగా శ్మశానవాటికలు పూర్తి చేయడానికి ఒకటి లేదా రెండు పార్కులు ఏర్పాటు చేయడానికి సమీకృత మార్కెట్ ను ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నామని తెలిపారు. 25 స్తంభాలను కొత్తగా వేయడానికి విద్యుత్ శాఖ రెండ్రోజులలో చర్యలు తీసుకొనున్నదని, అదేవిధంగా ఇరుకు సందులలో వాహనాలు వెళ్లలేని చోటికి రెండు చిన్న వాహనాలను అందించడానికి జిల్లా కలెక్టర్ అంగీకరించారని తెలిపారు.ప్రజలు కూడా తమ వంతుగా తమ వాడలు అభివృద్ధికి శుభ్రం చేసుకోవడానికి శ్రమదానం చేయడంతోపాటు మోరీలు, రోడ్లపైన చెత్త వెయ్యకుండా అవగాహన కల్పించుకోవాలని మహిళా సంఘాల సభ్యులు ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లత, మున్సిపల్ చైర్ పర్సన్ మల్లెల రాజశ్రీ, విద్యుత్ శాఖ ఎస్ ఇ సుదర్శనం, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, dco సింహాచలం, ఆర్డీవో శ్రీనివాస్, వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.