విశాఖ ఎయిర్పోర్ట్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు జరిగిన పరాభవం ఇప్పట్లో తెలుగు తమ్ముళ్లు మర్చిపోలేరు. విశాఖలో రాజధాని ఏర్పాటు కాకుండా కుట్రలు చేస్తున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. విశాఖలో అడుగుపెట్టనివ్వకుండా ఎయిర్పోర్ట్ దగ్గరే అడ్డుకుని ఆయన కాన్వాయ్పై టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు తన ఫోటోపై చెప్పుతో కొడుతుంటే చంద్రబాబు చేష్టలుడిగి చూస్తుండి పోయాడు.గతంలో అమరావతిలో తనపై చెప్పులు విసిరినా, వైజాగ్లో ఎదురైన అవమానాన్ని చంద్రబాబు కూడా జన్మలో మర్చిపోడు. అయితే విశాఖలో జరిగింది ట్రైలరే..అసలు సిన్మా ముందుంది అంటున్నాడు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఏపీ వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ను, విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తూ అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా కొనసాగుతుందని సీఎం జగన్ ప్రకటించారు.
అయితే కర్నూలు, వైజాగ్లలో రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత రెండున్నర నెలలుగా చంద్రబాబు రాజధాని రైతులతో ఆందోళనలను నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో రాయలసీమ ప్రజలను రౌడీలు, కబ్జాదారులుగా వర్ణిస్తూ…ఉత్తరాంధ్ర ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రగిలిస్తున్నాడు. మరోవైపు సీమ ప్రజలకు వైజాగ్ దూరమని రెచ్చగొడుతున్నాడు. చంద్రబాబు కుటిల రాజకీయాలను గమనించిన ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖలో ఘోరంగా అవమానించి తిప్పి పంపించారు. అయితే చంద్రబాబు కుట్రలపై సీమవాసులు కూడా రగిలిపోతున్నారు. పులివెందుల రౌడీలు, సీమ గూండాలంటూ తమను కించపరుస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలపై రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతే కాదు కర్నూలులో హైకోర్టు వస్తే ఏం వస్తుంది…నాలుగు టీకొట్లు..రెండు జీరాక్స్ షాపులు తప్పా అంటూ టీడీపీ నేతలు, అమరావతి రైతులు చేస్తున్న ఎగతాళిపై సీమ ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో అడుగుపెట్టకుండా ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా అవమానించి తిప్పి పంపారో..అలాగే కర్నూలులో కూడా చంద్రబాబును అడుగుపెట్టనిచ్చేది లేదని సీమ ప్రజలు తేల్చిచెబుతున్నారు.
తాజాగా విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనపై నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఉనికి కోసం ప్రజా చైతన్య యాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారని శిల్ప రవిచంద్ర ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని.. అందుకే విశాఖలో ఆయనను ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. తమ ప్రాంతంలో జ్యుడిషియల్ క్యాపిటల్కు మద్దతు ఇవ్వకపోతే కూడా చంద్రబాబుకు విశాఖలో పట్టిన గతే కర్నూలులో కూడా పడుతుంది హెచ్చరించారు. కర్నూలును రాజధానిగా స్వాగతించిన తర్వాతే చంద్రబాబు రాయలసీమలో అడ్డుగుపెట్టాలని శిల్ప రవిచంద్ర కిషోర్రెడ్డి స్పష్టం చేశారు. మొత్తంగా విశాఖలో జరిగింది ట్రైలరే..అసలు సిన్మాలో కర్నూలులో ఉంది…దమ్ముంటే అడుగుపెట్టు చంద్రబాబు అంటూ సీమ ప్రజలు సవాల్ విసురుతున్నారు. మరి చంద్రబాబు కర్నూలులో అడుగుపెట్టే ధైర్యం చేస్తాడో లేదో చూడాలి.