టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం తన కుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత రెండున్నర నెలలుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా అమరావతి వద్దు..మూడు రాజధానులు ముద్దు అంటూ జేఏసీ ఏర్పాటు చేసి కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. తాను స్వయంగా జోలెపట్టి ఉద్యమానికి విరాళాలు సేకరించాడు. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్నాడు. అయినా ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తోంది.. దీంతో అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు..బాబు ప్రజా సంకల్పయాత్రలు చేపట్టాడు. ఈ క్రమంలో వైజాగ్ వెళ్లిన చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకుని చెప్పులు, టమాటాలు విసిరి తమ నిరసన తెలిపారు. జై అమరావతి కాదు..జై విశాఖ అనేవరకు చంద్రబాబును విశాఖలో అడుగుపెట్టనివ్వబోమని ఉత్తరాంధ్ర ప్రజలు తేల్చిచెప్పారు.
కాగా చంద్రబాబు కేవలం రాజధాని జిల్లాలలో బలంగా ఉన్న తన కులం ప్రయోజనాల కోసమే అమరావతి ఆందోళనలు నడిపిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. గత రెండున్నరనెలలుగా అమరావతి ప్రాంతంలోని ఆందోళనలు జరుగుతున్న ఐదారుగ్రామాల్లో 80 శాతం మంది చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారే అన్నది ముమ్మాటికి ఒప్పుకోవాల్సిన నిజం.. కేవలం బాబు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాలల్లోనే తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే అమరావతి ఉద్యమాన్ని మిగతా కులాలు ఓన్ చేసుకోవడం లేదన్నది సుస్పష్టం. కేవలం తన కుల ప్రయోజనాల కోసమే చంద్రబాబు వికేంద్రీకరణకు అడ్డుపడుతూ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు ద్రోహం చేస్తున్నాడని..ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మండిపడుతున్నారు.
తాజాగా మంత్రి పెద్దిరెడ్డి కూడా చంద్రబాబు తన కులం కోసమే పని చేస్తున్నారంటూ కుండబద్ధలు కొట్టారు. సీఎం జగన్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ బాగుండాలనే ముందుచూపుతో మూడు రాజధానులపై ప్రకటన చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. అయితే ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం తన సొంత కులం ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని..అందుకే అమరావతి ఆందోళనలు నడిపిస్తున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే అమరావతి ఆందోళల నేపథ్యంలో చంద్రబాబుపై రాష్ట్రస్థాయి నేతగా కాకుండా కులనేతగా ముద్రపడింది. ఇప్పుడు వైసీపీ నేతల విమర్శలతో బాబు మీద కుల ముద్ర గట్టిగానే పడే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా చంద్రబాబు సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. అయినా పెద్దిరెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు ఏమీ పట్టించుకోకుండా.. చంద్రబాబు తన సొంత కులం కోసమే పని చేస్తున్నారంటూ డైరెక్ట్గా ఎటాక్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరి మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.