రాష్ట్రంలో కరోనా వైరస్పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమావేశమైంది.
ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య శాఖ అధికారులతో కలిసి మంత్రులు సమీక్షించారు. ప్రజల్లో అవగాహన పెంచడం సహా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
వ్యాధి లక్షణాలు ఉన్నవారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని మంత్రులు నిర్ణయించారు. 24 గంటల పాటు నడిచే కాల్సెంటర్తో పాటు ఇప్పుడున్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలన్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ వైరస్తో చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. కరోనా చికిత్సకు సంబంధించి గాంధీ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రులు తెలిపారు.