ఉద్యోగులు తమ విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర అటవీ పర్యావరణం న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ లతో కలిసి కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్ పనితీరుపై పరిశీలించారు. వీడియో కాలింగ్ ద్వారా లక్ష్మణ్చందా ఎంపీడీవో మోహన్ తో మాట్లాడి విధులలో భాగంగా అతను ఏ గ్రామంలో ఉన్నది అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి లో భాగంగా చింతకుంట వాడ ప్రత్యేక అధికారి ఎక్కడున్నది తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు , ఉద్యోగుల్లో జవాబుదారితనం పెంచేందుకు, సక్రమంగా విధులు నిర్వహించేందుకు కంట్రోల్ రూమ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిర్మల్ కలెక్టరేట్ లో ప్రభుత్వ ఉద్యోగుల్లో పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ మంత్రి అభినందించారు. ఇలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. మంత్రి అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు.